బెంగుళూరు, ఏప్రిల్ 26 : చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సారథి మెరుపులు మెరిపించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు నిర్దేశించిన 206 పరుగుల కొండంత లక్ష్యాన్ని ధోని (70 నాటౌట్; 34 బంతుల్లో 1×4, 7×6), రాయుడు (82; 53 బంతుల్లో 3×4, 8×6) కలిపి ఉతికి ఆరేశారు. 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన సీఎస్కే జట్టుపై అభిమానులు, క్రికెట్ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ముఖ్యంగా ధోని ఆటే ఇన్నింగ్స్ కు హైలైట్. చాలాకాలం తర్వాత సిక్సర్ల మోత మోగించి జట్టుకు అనూహ్య విజయాన్నందించిన ‘మిస్టర్ కూల్’ ధోనిపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ తన అభిమానాన్ని చాటుకున్నాడు.
‘ఓరి దేవుడా కాసేపు పడుకుందామనుకుంటే సిక్సర్ల వర్షంతో నా నిద్రకు భంగం కల్గించారు. చైన్నైకి అద్భుత విజయాన్ని అందించారు. కానీ నా నిద్ర మాత్రం అంతరాయం అయ్యింది. ఎంతైనా ఎంఎస్ ధోని విశ్వ విఖ్యాత ఆటగాడు. మీ ఆటకు విజిల్ వేయాల్సిందే...(విజిల్ పోడు)’ అంటూ హెడెన్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.