హైదరాబాద్, ఏప్రిల్ 27 : వరుసుగా నాలుగు విజయాలతో ఊపుమీదున్న పంజాబ్ జట్టుకు షాక్. సన్ రైజర్స్ హైదరాబాద్ మరో సారి బౌలింగ్ తో పంజాబ్ పై పంజా విసిరింది. ముంబై ఇండియన్స్ తో 118 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకున్నా హైదరాబాద్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్పై 132 పరుగులు చేసి కూడా గెలిచింది.
తొలుత టాస్ నెగ్గిన కింగ్స్ X1 సారథి అశ్విన్ ప్రత్యర్ధి కు బ్యాటింగ్ అప్పగించాడు. పంజాబ్ బౌలర్లలో పేసర్ అంకిత్ రాజ్పుత్ ఈ ఐపీఎల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసి (5/14) రైజర్స్ జట్టుని తక్కువ స్కోర్ కే పరిమితం చేశాడు. సన్ రైజర్స్ జట్టులో మనీష్ పాండే 54 రాణించాడు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 132 పరుగులు చేసింది.
అనంతరం లక్ష్య ఛేదన లో పంజాబ్ జట్టుకు ఆరంభం అదిరింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (32), క్రిస్ గేల్ (23) తొలి వికెట్కు 55 పరుగులు జోడించి పంజాబ్కు శుభారంభం అందించారు. సాఫీగా సాగిపోతున్న ఇన్నింగ్స్ కు స్పిన్నర్ రషీద్ ఖాన్ (3/19) మాయ చేశాడు. కే.ఎల్ రాహుల్ వికెట్ తీసి పంజాబ్ పతనాన్ని శాసించాడు.
అతనితో పాటు షకిబ్ (2/18), సందీప్శర్మ (2/17), బాసిల్ థంపి (2/14) రాణించారు. దీంతో పంజాబ్ 19.2 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. కింగ్స్ X1 ఓడినా.. అంకిత్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.