హైదరాబాద్, ఏప్రిల్ 27: క్రిస్ గేల్.. టీ-20ల్లో ఒక సునామీ.. తన ఆటతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. భారత్ లో అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. గేల్ ఎక్కడ ఉన్న సరదా వాతావరణమే ఉంటుంది. ఈ విషయాన్ని ఇప్పటికే ఎంతో మంది క్రికెటర్లు చెప్పారు.
తాజాగా నిన్న ఉప్పల్ లో సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో మైదానంలో వికెట్ కీపర్లా మారి అభిమానుల్ని ఆశ్చర్యపరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది. టోర్నీలో భాగంగా గురువారం సన్రైజర్స్ హైదరాబాద్ - కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ స్థానంలో గేల్ చేతికి గ్లౌజులు తగిలించుకుని కాసేపు సందడి చేశాడు.
సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చేసే సమయంలో ఆరో ఓవర్లో వికెట్ కీపర్గా ఉన్న కేఎల్ రాహుల్ కాస్త విరామం తీసుకుని మైదానాన్ని వీడాడు. దీంతో మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న గేల్ వికెట్ల వెనక్కి వచ్చి రాహుల్ వదిలి వెళ్లిన గ్లౌజులు చేతికి ధరించాడు. వికెట్ల వెనుక పొజిషన్ చూసుకున్నాడు. అంతా ఓకే అనుకుని బౌలర్ బరిందర్ శరణ్ను బౌలింగ్ కూడా వేయమన్నాడు.
ఇంతలో రాహుల్ మైదానంలోకి రావడంతో గ్లౌజులు రాహుల్కి ఇచ్చేసి యథావిధిగా ఫీల్డింగ్ చేసేందుకు వెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ‘గేల్-ది వికెట్ కీపర్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు గేల్ పార్ట్ టైమ్ వికెట్ కీపర్’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కొన్ని రోజుల క్రీతం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు కేఎల్ రాహుల్ పుట్టిన రోజు నాడు కేకు స్థానంలో గేల్ కూర్చుని సరదాగా ఆట పట్టించిన విషయం తెలిసిందే.
Gayle - the wicketkeeperhttps://t.co/yXpK5092kJ
— Faizal Khan (@faizalkhanm9) April 26, 2018