ఢిల్లీ, మే 2 : ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూహెచ్ఓ) ప్రపంచం మొత్తంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాను విడుదల చేసింది. అందులో మనదేశ రాజధాని ఢిల్లీ ప్రథమ స్థానంలో ఉంది. విచారకరమైన విషయం ఏమిటంటే ప్రపంచంలో అత్యంత కాలుష్యపూరితమైన 20 నగరాల జాబితాలో 14 భారత్లోనే ఉన్నాయి. ఢిల్లీ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉండగా, ముంబయి నాలుగో స్థానంలో ఉంది.
ఈజిప్టులోని గ్రేటర్ కైరో కాలుష్య నగరాల్లో రెండో స్థానంలో ఉండగా, మూడో స్థానంలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, అయిదో స్థానంలో చైనా రాజధాని బీజింగ్ ఉంది. కాలుష్య నగరాల జాబితాలో భారత్లో దిల్లీ, ముంబయి, గ్వాలియర్, వారణాసి, కాన్పూర్ సహా తదితర నగరాలు ఉన్నాయి. ప్రపంచంలోని ప్రతి 10 మందిలో తొమ్మిది మంది కాలుష్యపూరిత గాలిని శ్వాసిస్తున్నట్లు డబ్ల్యూహెచ్వో వెల్లడించింది.