జయనగర్, మే 4 : కర్ణాటక ఎన్నికల ప్రచారంలో విషాదం చోటు చేసుకుంది. జయనగర్కు చెందిన భాజపా ఎమ్మెల్యే బీఎన్. విజయ్ కుమార్ (60) గుండెపోటుతో మృతిచెందారు. గురువారం సాయంత్రం జయనగర్, పట్టాభిరామనగర్ ప్రాంతంలో ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఛాతీలో తీవ్రమైన నొప్పి రావటంతో ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ని అనుచరులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి 1 గం. ప్రాంతంలో మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు.
కర్ణాటక రాష్ట్రంలో తనదైన ముద్రవేసుకున్న విజయ్కుమార్ జయనగర్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ సారి కూడా ఆయన ఇక్కడి నుంచే పోటీచేస్తున్నారు. విజయ్ కుమార్ మృతితో ఆయన సొంత నియోజక వర్గంలో ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉంది. ఈనెల 12న కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు గానూ ఎన్నికలు జరగనున్నాయి.