హైదరాబాద్, మే 4: ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందక, సంస్థలో డబ్బులు లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఆర్టీసీ.. సిబ్బందికి వేతనాలివ్వడం కష్టంగా మారింది. కొంత కాలంగా నాలుగైదు రోజులు ఆలస్యంగా కార్మికులకు వేతనాలు చెల్లిస్తోంది. ఈ నెల ఒకటో తేదీన వేతనాలు అందాల్సి ఉన్నా.. గురువారం రాత్రి వరకు కూడా అందకపోవడంతో కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
దీంతో గుర్తింపు కార్మిక సంఘాలైన తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయిస్ యూనియన్, తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్లు శుక్రవారం ధర్నాలకు పిలుపునిచ్చాయి. అన్ని బస్ డిపోలు, బస్ భవన్ ఎదుట భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించాలని ఆయా సంఘాల నేతలు ప్రకటించారు. శుక్రవారం సాయంత్రంలోగా వేతనాలు అందకుంటే శనివారం నుంచి బస్సులు నడిపేది లేదని హెచ్చరించారు.