తమిళనాడుకు నీరు ఇవ్వలేం : కర్ణాటక

     Written by : smtv Desk | Fri, May 04, 2018, 04:54 PM

తమిళనాడుకు నీరు ఇవ్వలేం : కర్ణాటక

బెంగళూరు, మే 4 : కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు 4 టీఎంసీల నీటిని ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఇవ్వలేమని సుప్రీం కోర్టుకు విన్నవించింది. కావేరి జలాల విషయంలో తమిళనాడుకు ప్రస్తుతం ఇస్తున్న దానికంటే 4 టీఎంసీలు అదనంగా నీటిని విడుదల చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ తీర్పుపై స్పందించిన కర్ణాటక తమిళనాడుకు అదనంగా నీరు ఇచ్చే పరిస్థితిలో రాష్ట్రం లేదని పేర్కొంది.

"మాకు నీటి కొరత ఉంది. క్షమించండి. తమిళనాడుకు నీరు ఇవ్వలేం. ఒకవేళ ఆ రాష్ట్రానికి నీరు ఇవ్వాలని మాకున్నా.. మా వద్ద అంత నీటి నిల్వ లేదు. కావేరీ బేసిన్‌లోకి నాలుగు కాల్వల నుంచి మొత్తం 9 టీఎంసీల నీరు వస్తోంది. ఆ 9 టీఎంసీలు మాకు సాగు, త్రాగునీటికి సరిపోవట్లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను పాటించలేకపోతున్నాం. ఈ విషయం గురించి సుప్రీంకు వివరణ ఇస్తాం" అని కర్ణాటక నీటి వనరుల శాఖ మంత్రి ఎంబీ పాటిల్‌ వ్యాఖ్యానించారు.

తమిళనాడులో కావేరీ యాజమాన్య బోర్డు నిర్వహించాలని రాష్ట్రంలో కొంతకాలంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం మే 4 లోపు ముసాయిదాను అందించాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కానీ ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటక ఎన్నికల ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉండడంతో ముసాయిదాను ప్రవేశపెట్టలేకపోయారు. దాంతో ఈ కేసును ధర్మాసనం మే 8కి వాయిదా వేస్తున్నట్లు చెప్పింది.





Untitled Document
Advertisements