గుంటూరు, మే 5 : దాచేపల్లి ఘటనలో బాధితురాలైన చిన్నారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం పరామర్శించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. మైనర్ బాలికలపై దారుణాలకు పాల్పడే వారికి ఉరిశిక్ష విధిస్తామని అన్నారు. రాష్ట్రంలో ఇదే ఆఖరి ఘటన కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
అన్నెంపున్నె౦ ఎరుగని పసిబిడ్డలపై అఘాయిత్యాలు జరిగితే తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని అన్నారు. ఇలాంటి అమానవీయ ఘటనలను చూసి నాగరిక ప్రపంచం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఘటనపై స్సందించి వెంటనే 17 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఘోరంపై స్పందించిన ప్రజలను సీఎం అభినందించారు. సోమవారం ఆడబిడ్డకు రక్షణగా కదులుదాం అనే ర్యాలీని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.