లాస్ఏంజిల్స్, మే 5 : అగ్ని పర్వతాలు అంటే గుర్తొచ్చేది హవాయి ద్వీపం. తాజాగా ఈ ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైంది. ఈ తీవ్రతతో మరోసారి అగ్నిపర్వతం నుంచి లావా ఉబికి వస్తోంది. అంతేకాకుండా అత్యంత ప్రమాదకరంగా సల్ఫర్ డై ఆక్సైడ్ వాయువు విడుదలవుతోంది. దీంతో సమీపంలోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. గురువారం నుంచి కిలౌయీ అగ్నిపర్వతం పెద్ద ఎత్తున పొగలు, లావా, బూడిద ఎగిసిపడుతున్నాయి.
దీంతో అత్యవసర సేవల విభాగం అధికారులు పరిసర ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించారు. శుక్రవారం అగ్నిపర్వతం సమీపంలో 5.3తీవ్రతతో భూకంపం సంభవించింది. మరో గంట తర్వాత 6.9 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది. అగ్నిపర్వతం నుంచి మరింతగా లావా బయటకు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమెరికా జియోలాజికల్ సర్వే హెచ్చరించింది. అగ్నిపర్వతం నుంచి ప్రమాదకర వాయివులు వెలువడుతున్నందున జాగ్రత్తగా ఉండాలని అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.