ఇండోర్, మే 5 : ఐపీఎల్ అంటేనే.. సిక్స్ లు ఫోర్లు.. మైదానంలో ఒకటే హోరు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరుగుతున్నా మ్యాచ్ లు అభిమానులకు సూపర్ మాజను ఇస్తున్నాయి. తాజాగా ముంబై ఇండియన్స్ సారథి ఓ సరికొత్త రికార్డును లిఖించాడు. శుక్రవారం ముంబై ఇండియన్స్- కింగ్స్ X1 పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో రెండు సిక్సర్లు బాది... టీ20 క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన మొదటి భారతీయ బ్యాట్స్మన్గా రికార్డు సృష్టించాడు.
కింగ్స్ పంజాబ్ బౌలర్ ముజీబ్ ఉర్ రెహమాన్ 17వ ఓవర్లో వేసిన బంతిని రోహిత్ శర్మ సిక్సర్గా మలిచాడు. తద్వారా పొట్టి ఫార్మాట్లోని అన్ని టోర్నమెంట్లలో కలిపి 301 సిక్సర్లు బాది ఈ ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్లో అత్యధిక సిక్సర్ల వీరుల జాబితాలో క్రిస్గేల్ (844) ప్రథమ స్థానంలో ఉండగా.. కిరన్ పొలార్డ్(525), బ్రెండన్ మెకల్లమ్(445), డ్వేన్ స్మిత్(367), షేన్ వాట్సన్(357), డేవిడ్ వార్నర్ (319), రోహిత్ శర్మ (301) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఐపీఎల్ చరిత్రలో కూడా క్రిస్గేల్ (290) తర్వాత రోహిత్ (183) సిక్సర్లతో ద్వీతీయ స్థానంలో నిలిచాడు. ధోని, సురేశ్ రైనా 180, డివిల్లియర్స్ 179 సిక్సర్లతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో 79 మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ 1852 పరుగులు చేశాడు. వీటిలో రెండు సెంచరీలతో పాటు, 14 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.