న్యూఢిల్లీ, మే 5 : సాదారణంగా ఇప్పటి వరకు మహిళా బోగీలను రైలు బండి చివరిలో గానీ, ప్రారంభంలో గానీ ఏర్పాటు చేసే వారు. కానీ ఇప్పుడు మహిళలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా వారికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోగీలను రైలు మధ్యలోనే చేరుస్తారు. తేలిగ్గా గుర్తించేందుకు దానికి భిన్నమైన రంగు పెయింట్ వేస్తారు. దీనిని సబర్బన్ రైళ్లతోపాటు దూర ప్రాంత రైళ్లలోనూ అమలు చేయనున్నారు. సదరు మహిళా బోగీల్లో అదనంగా సీసీటీవీ కెమెరాలతోపాటు కిటికీలకు ఇనుప జాలీలను అమర్చే అంశాన్ని రైల్వేశాఖ పరిశీలిస్తున్నది.
కిటికీల గుండా పురుషులు మహిళా బోగీలోకి ప్రవేశిస్తున్న ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో వాటికి ఇనుప జాలీని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన చర్చకు వచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మూడు రైల్వేస్టేషన్ల పరిధిలో అంతా మహిళా ఉద్యోగులే పని చేస్తున్నారు. దీన్ని వచ్చే మూడేండ్లలో 100 స్టేషన్లకు విస్తరించాలని లక్ష్యంగా రైల్వేశాఖ పెట్టుకున్నది. ప్రతి జోన్లోనూ ప్రతి 10 స్టేషన్లకు ఒకటి చొప్పున మహిళా ఉద్యోగులతోనే భర్తీ చేయాలని జోనల్ జనరల్ మేనేజర్లకు ఆదేశాలు వెళ్లినట్లు అధికార వర్గాలు తెలిపాయి.