కరీంనగర్, మే 5: రైతుల పంట పెట్టుబడి కోసం ప్రభుత్వం ప్రారంభించనున్న రైతుబంధు పథకంపై రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన ఈ సమావేశంలో ఈటెల మాట్లాడుతూ... హుజురాబాద్లో ఈ నెల 10న సీఎం కేసీఆర్ రైతుబంధు పథకం ప్రారంభిస్తారని, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు లక్ష మంది రైతులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు.
రైతుల పంట పెట్టుబడి కోసం సర్కారు విడుదల చేసే ప్రతీ పైసా రైతులకే చేరుతుందన్నారు. ఈ నెల 10న జరిగే సీఎం బహిరంగ సభను రైతులు తమ ఇంటి పండుగగా భావించి విజయవంతం చేయాలని కోరారు. వచ్చే ఏడాది ఉమ్మడి కరీంనగర్ జిల్లాను సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా ప్రకటిస్తామని తెలిపారు. ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.