హైదరాబాద్, మే 8 : కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఎన్నికలు దగ్గరపడుతున్నందునే ముఖ్యమంత్రి కేసీఆర్ ‘రైతుబంధు’ అనే కొత్త నాటకం మొదలుపెట్టారని ఆరోపణలు చేశారు. రైతులకు గిట్టుబాటు ధర రాకపోతే నిలదీయాలని, ధర్నా చేయాలని చెప్పిన కేసీఆర్.... ధర్నా చేస్తున్న రైతులకు మాత్రం సంకెళ్లు వేయించారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మూడు వేలకు పైగా రైతులు మరణిస్తే ఏ ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకోలేదని విమర్శించారు.
రైతు బంధు కార్యక్రమానికి వచ్చే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రావొద్దంటూ లేఖలు రాస్తానని చెప్పారు. రాష్ట్రంలో సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఓటుకు నోటు కేసును మళ్లీ తెరపైకి తెస్తున్నారని వీహెచ్ అన్నారు. 'రైతుబంధు' అంటే రైతుకు సంకెళ్లు వేయడమా’ అంటూ రైతులకు జరిగిన అన్యాయాన్ని వివరించే గోడపత్రికలను వీహెచ్ విడుదల చేశారు.