న్యూఢిల్లీ, మే 10 : రైలు ఎక్కినపుడు గాని, దిగేటప్పుడు గాని ప్రమాదం జరిగితే అందుకు తగ్గ పరిహారాన్ని రైల్వే శాఖ చెల్లించాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ప్రయాణికులే నిర్లక్ష్యంగా వ్యవహరించారని అనేందుకు వీలు లేదని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ ఏకే గోయల్, ఆర్ఎఫ్ నారిమన్లతో కూడిన ధర్మాసనం ఈ సంచలన తీర్పునిచ్చింది. అలాంటి సందర్భాలను ప్రయాణికుడి నిర్లక్ష్యంగా పరిగణించరాదని కూడా చెప్పింది.
అయితే, రైల్వే ప్రాంగణంలో పడి ఉన్నంత మాత్రాన సదరు పరిహారం కోసం అభ్యర్థించే అర్హత ఉన్న ప్రయాణికుడిగా కూడా పరిగణించరాదని ఉద్ఘాటించింది. సదరు వ్యక్తి వద్ద రైలు టిక్కెట్ లేనంత మాత్రన పరిహారం పొందడానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదన్నారు. ఈ నేపథ్యంలో బాధితుడు/బాధితురాలు తమది నూటికి నూరుపాళ్లు అర్హతకలిగిన వాస్తవమైన అభ్యర్థనే అని నిరూపించే పత్రాలను మాత్రం సమర్పించాల్సి ఉంటుంది.