పట్నా, మే 10: ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ మూడు రోజుల పాటు పెరోల్పై విడుదల కాబోతున్నారు. దాణా కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆయనకు న్యాయస్థానం ఐదు రోజుల పెరోల్ మంజూరు చేసినట్లు గతంలో వార్తలు వెలువడ్డాయి. కానీ, ఇప్పుడు మూడు రోజుల పెరోలే మంజూరు చేసినట్లు బిర్సా ముందా ఐజీ హర్ష్ మంగళ మీడియా ద్వారా తెలిపారు. లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ వివాహం నేపథ్యంలో ఝార్ఖండ్ న్యాయస్థానం పెరోల్ మంజూరు చేసింది.
ఈరోజు సాయంత్రం లాలూ పట్నాకు బయలుదేరనున్నట్లు హర్ష్ వెల్లడించారు. అయితే పెరోల్ నేపథ్యంలో న్యాయస్థానం లాలూకు పలు ఆంక్షలు విధించింది. ఆయన బయట ఉన్న మూడు రోజుల పాటు మీడియాతో మాట్లాడకూడదు. అంతే కాకుండా ఆయన చేసే ప్రతీ పని వీడియోలో రికార్డు అవుతుంది. లాలూ బయట ఉన్నంత వరకు బిహార్, ఝార్ఖండ్ పోలీసులు ఆయనకు భద్రత కల్పిస్తారు. ఏ పార్టీ నేత కానీ, కార్యకర్త కానీ లాలూను కలవకూడదు, మాట్లాడకూడదని న్యాయస్థానం నిబంధనలు జారీ చేసింది.