కర్ణాటక, మే 10 : కర్ణాటక ఎన్నికల ముందు కమలం పార్టీకి పెద్ద షాక్ తగిలింది. బీజేపీ అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎం కాగలడని భావిస్తున్న బీ శ్రీరాములుకు సంబంధించిన ఓ స్టింగ్ ఆపరేషన్ వీడియో సంచలనం రేపింది. మైనింగ్ కేసు నుంచి బయటపడేందుకు గాను రూ.160 కోట్లు లంచం ఇచ్చేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి అల్లుడితో మాట్లాడుతున్నట్లు ఆరోపిస్తూ బీ టీవీ చానెల్ ఒక వీడియోను ప్రసారం చేసింది. ఇప్పుడు ఈ వీడియో కర్ణాటకలో రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది.
కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో గాలి జనార్ధన్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వకపోయినా అతని ప్రధాన అనుచరుడు శ్రీరాములుకు మాత్రం బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. ఈయన బదామి నుంచి ముఖ్యమంత్రి సిద్ద రామయ్యపై శ్రీరాములు పోటీ చేస్తున్నారు. అయితే బీ టీవీ బయటపెట్టిన ఈ వీడియో ఎప్పటిది? అన్న విషయం తేలలేదు.
వీడియోలో జడ్జి అల్లుడితో శ్రీరాములు మంతనాల దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏకంగా రూ.160 కోట్లు ఇచ్చేందుకు శ్రీరాములు బేరసారాలు ఆడారని ఆ వీడియో బయటపెట్టిన బీ చానెల్ చెబుతోంది. మైనింగ్ కేసు నుంచి బయట పడేందుకే శ్రీరాములు ఈ బేరసారాలు జరిపినట్లు పేర్కొంది. అయితే ఈ వీడియో 2010 నాటిదని తెలుస్తోంది.