లాలూకు బెయిల్..

     Written by : smtv Desk | Fri, May 11, 2018, 02:56 PM

లాలూకు బెయిల్..

రాంచీ, మే 11 : ఆర్జేడీ అధినేత, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌కు భారీ ఊరట లభించింది. దాణా కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆయనకు రాంచీ హైకోర్టు తాత్కాలిక బెయిలు మంజూరు చేసింది. లాలూ అనారోగ్యం, వైద్య కారణాల మేరకు ఆరు వారాల తాత్కాలిక బెయిలును న్యాయస్థానం ఇచ్చింది. ఆయన పెద్ద కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ వివాహం నేపథ్యంలో ఝార్ఖండ్‌ న్యాయస్థానం మూడు రోజుల పాటు షరుతులతో పెరోల్ ఇచ్చిన విషయం తెలిసిందే. తేజ్ ప్రతాప్ యాదవ్... ఆర్జేడీ సీనియర్ నేత చంద్రికా రాయ్ కుమార్తె ఐశ్వర్య రాయ్‌ల వివాహం ఈ నెల 12న జరగనుంది. గురువారం సాయంత్రం ఆయన పాట్నా చేరుకున్నారు.

పట్నా విమానాశ్రయం వద్ద లాలూకు ఆయన కుమారులు, కుమార్తె తదితరులు స్వాగతం పలికారు. అనంతరం కొద్ది దూరంలోని రబ్రీదేవి నివాసానికి చేరుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన మద్దతుదారులు దారిపొడవునా నిల్చుని నినాదాలు చేశారు. బిర్సాముందా జైలులో శిక్ష అనుభవిస్తున్న లాలూ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.





Untitled Document
Advertisements