హైదరాబాద్, మే 11 : సాధారణంగా నెలసరి అనే సరికి చాలా మంది ఆ విషయాన్ని చెప్పడానికి నాన్చుతారు. ఇప్పటికే పీరియడ్స్ అంటే సమాజంలో కొన్ని చోట్ల ఓ తప్పుడు భావన ఉంది. కానీ ఒడిశాలో నెలసరులకి సంబంధించి ఏటా ఘనంగా ఓ ఉత్సవమే జరుపుతారు. దానిని రాజప్రభ ఉత్సవమంటారు.
మహిళలలకు నెలసరులు రావడం సరే.. మనం తల్లిగా కొలిచే భూదేవికీ ఏడాదికోసారి నెలసరులు వస్తాయనే నమ్మకంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ మూడురోజులూ అక్కడ పొలాలు దున్నడం కానీ, విత్తులు నాటడం కానీ చేయరు. ఆ సమయంలో ఆమె విశ్రాంతి తీసుకుంటుందని నమ్ముతారు!
తొలి రోజుని 'పహిలోరాజో' అనీ రెండోరోజుని 'మిథున సంక్రాంతి' అనీ, మూడోరోజుని 'భూదాహ' లేదా 'బసీరాజా' అని అంటారు. నాలుగోరోజు శుద్ధిస్నానం లేదా వసుమతి స్నానం చేస్తారు. భూదేవికే విశ్రాంతి అన్నాక మామూలు మహిళలకి ఉండదా..? ఈ ఉత్సవాలప్పుడు అక్కడి స్త్రీలు వంటావార్పూ వంటివేవీ పెట్టుకోరు. తమకు నచ్చిన ఆటలతో కాలక్షేపం చేస్తారు.