తిరుపతి, మే 12 : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్ దాడిపై రాష్ట్రంలో అలజడి రేగింది. నిన్న స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమవుతున్న అమిత్ షా కాన్వాయ్ పై దాడి చేశారనే ఆరోపణలతో ముగ్గురు తెదేపా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ తిరుపతి నగర శాసనసభ్యురాలు సుగుణమ్మ నిన్న రాత్రి నుంచి ఉదయం వరకు అలిపిరి పోలీస్స్టేషన్ వరకు ధర్నాకు దిగారు.
కేంద్రం, రాష్ట్రంలోని ప్రతిపక్షం కుమ్మక్కై టీడీపీపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాయని ఆరోపించారు. నగర తెదేపా శ్రేణులు మొత్తం అలిపిరి పోలీస్స్టేషన్ ఎదుట బైఠాయించటంతో కొన్ని గంటల పాటు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో అప్రమత్తమైన పోలీసులు తెదేపా కార్యకర్తలను విడుదల చేశారు.