అమరావతి, మే 14 : ఆంధ్రప్రదేశ్ భాజపా అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఎంపిక చేసినట్లు ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆయన నియామకంతో ఏపీలో కొందరు బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సోము వీర్రాజుకు అవకాశం ఇవ్వకపోవటాన్ని నిరసిస్తూ ఉభయ గోదావరి జిల్లాల్లో కొందరు నాయకులూ తమ పదవులకు రాజీనామా చేశారు. పార్టీలో మొదటి నుంచి ఉంటున్న వారిని కాదని... కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి పదవి కట్టబెట్టడాన్ని వారు తప్పుబడుతున్నారు.
పార్టీ అధ్యక్ష పదవిపై గంపెడాశలు పెట్టుకున్న సోము వీర్రాజుకు కన్నా నియామకం తీవ్ర నిరాశ కలిగించింది. సోము వీర్రాజుకు ఎన్నికల నిర్వహణ కమిటి కన్వీనర్ బాధ్యతలు అప్పగించారు. అయితే ఆయన అధ్యక్ష పదవి కోరుకున్నారు. అది నెరవేరకపోవటంతో అసంతృప్తికి లోనై అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గోదావరి జిల్లాలకు చెందిన నేతలు సోముకు అధ్యక్ష పదవి ఇవ్వకపోవటాన్ని నిరసిస్తూ తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు.