హైదరాబాద్, మే 15 : అలనాటి మేటి నటి సావిత్రి బయోపిక్ "మహానటి" చిత్ర౦లో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అచ్చం సావిత్రిలా ఆమె నటించిన నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇప్పటి వరకు హీరోల సరసన హీరోయిన్ గా కేవలం గ్లామర్ రోల్స్ ను ప్రదర్శించిన కీర్తి.. ఇలా కథనంతా తన భుజాలపై వేసుకొని నటించడం అనేది నిజంగా అద్భుతం అంటూ ప్రతి ఒక్కరు ఆమెను కొనియాడారు.
అయితే 'మహానటి' ఘన విజయం సాధించిన నేపథ్యంలో కీర్తి సురేశ్ ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంది. ఆమెకు వేద పండితులు స్వాగతం పలికి.. ఆశీర్వచనం చేసి.. పట్టువస్త్రంతో ఆలయ మర్యాదలు చేశారు. ఈ సందర్భంగా కీర్తి మాట్లాడుతూ.. 'మహానటి' సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉందని.. ఈ సినిమా ఘన విజయాన్ని సాధించడం వలన స్వామివారి దర్శనం కోసం వచ్చానని తెలిపారు. సమ౦త, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్ తదితరులు కలిసి నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతోంది.