హైదరాబాద్, మే 16 : కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన "మహానటి" చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఆమె నటనకు ప్రేక్షకాభిమానులు ఫిదా అయిపోయారు. ప్రతి ఒక్కరు ఆమె నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ లో కీర్తి సురేష్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
జయలలిత బయోపిక్ తీస్తామంటూ గత కొన్ని రోజులుగా దర్శకనిర్మాతలు ముందుకు వచ్చారు. కాని ఈ చిత్రంపై ఇంకా ఓ అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి ఈ వార్తలన్ని కొట్టిపారేసింది. ప్రస్తుతం తాను ఏ బయోపిక్ లో నటించడం లేదని తేల్చి చెప్పేసింది.
అంతేకాదు అందాల సుందరి దివంగత తార శ్రీదేవి జీవిత గాథతో సినిమా చేసే ఛాన్సుందా.? అన్న ప్రశ్నకు అలాంటిదేం లేదు. తాను శ్రీదేవి బయోపిక్ లో కూడా నటించట్లేదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా 1999 లో జయలిత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో యాంకర్.. జయలలితను బయోపిక్ గురించి ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. ఐశ్వర్యరాయ్ అయితే తన పాత్రకు సరిపోతారని అభిప్రాయపడ్డారు.