అమరావతి, మే 16 : ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా త్వరలో మోగానుంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది సమయమున్నా.. అంతకంటే ముందే స్థానిక సంస్థల ఎన్నికలు సమరం జరగనుంది. గ్రామపంచాయితీ పదవీకాలం జులై నెలాఖరుతో ముగియనుండడంతో అంతకన్నా ముందే ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది. ఏ సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినా సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది.
వార్డులవారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని... రిజర్వేషన్ల ఖరారు, ఎన్నికల నిర్వహణకోసం అవసరమైన చర్యలకు నిర్దేశిత షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. ఎన్నికల సంఘం సూచనలకు అనుగుణంగా జూన్15 కల్లా వార్డులవారీగా ఓటర్లజాబితా ప్రకటించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం గ్రామాలవారీగా ఉన్న ఓటర్ల జాబితాను వార్డులవారీగా తయారుచేసే పనిలో పడ్డారు. కులాలవారీ జాబితా తయారు చేయడంతో రిజర్వరేషన్ల విషయంలో స్పష్టత రానుంది.