చెన్నై, మే 17 : తన నటనతో ప్రేక్షకాభిమానులను "ఫిదా" చేస్తున్న సాయి పల్లవి ప్రతి సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటుంది. వైవిధ్యభరితంగా పాత్రలను ఎంచుకుంటూ తనదైన శైలిలో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె ధనుష్కి జోడీగా "మారి 2" చిత్రంలో నటిస్తున్నారు. 2015లో వచ్చిన "మారి" సినిమాకు ఇది సీక్వెల్గా రాబోతోంది. బాలాజీ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్రంలో ధనుష్కు జోడీగా సాయి పల్లవి నటిస్తోంది. అయితే ఈ సినిమాలో సాయి పల్లవి ఆటో డ్రైవర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ పాత్ర కోసం ఆమె ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారట. ఈ పాత్రతో ఆమె మాస్ ఆడియన్స్ నుంచి మరిన్ని మార్కులు కొట్టేయడం ఖాయమని అంటున్నారు. ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేయనున్నారు.
ఇక ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను చేస్తుండటం విశేషం. వండర్బార్ ఫిలింస్ బ్యానర్పై ఈ సినిమాను ధనుష్ నటిస్తూ.. నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు సాయి పల్లవి సూర్యకు జోడీగా "ఎన్జీకే" చిత్రంలో నటిస్తున్నారు. తెలుగులో శర్వానంద్కు జోడీగా "పడి పడి లేచె మనసు" చిత్రంతో బిజీగా ఉన్నారు.