ఢిల్లీ, మే 17 : ఆటగాళ్లకు ఆటలో నైపుణ్యం, ప్రతిభాతో పాటు క్రమశిక్షణతో మెలగాలి. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సివస్తుంది. తాజాగా నలుగురు భారత మహిళా రెజ్లర్లు క్రమశిక్షణ తప్పారు. కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించడమే కాక వారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘దంగల్’ సినిమాతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఫోగట్ సిస్టర్స్ గీత, బబితలతో పాటు వీరి చెల్లెళ్లు రీతు, సంగీత కూడా ప్రస్తుతం లక్నోలో నిర్వహిస్తున్న నేషనల్ క్యాంప్కు హాజరుకాలేదు. ఈ కారణం వల్ల డబ్ల్యూఎఫ్ఐ వీరి మీద వేటు వేసింది. త్వరలో జరగబోయే ఆసియా గేమ్స్ కోసం డబ్ల్యూఎఫ్ఐ లఖ్నవూలో క్యాంపు ఏర్పాటు చేసింది. ఐతే, ఈ క్యాంపుకు సుమారు 11 మంది రెజ్లర్లు డుమ్మా కొట్టారు. వారిలో భారత్కు పతకాలు అందించిన ఫొగట్ సిస్టర్స్ కూడా ఉన్నారు.
ఆసియా గేమ్స్కు ఎంపికైన సంగీత, గీత, రీతు, బబితా ఫొగట్లు లఖ్నవూలో ఏర్పాటు చేసిన జాతీయ శిక్షణ శిబిరానికి హాజరు కావాల్సి ఉంది. ఐతే, వీరెవ్వరూ ఈ శిబిరానికి హాజరుకాలేదు. అంతేకాదు ఎందుకు హాజరుకాలేక పోతున్నామో తెలుపుతూ వారు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ)కు ఎలాంటి సమాచారం అందించలేదు. ఈ నలుగురు సోదరీమణులు శిబిరానికి హాజరుకాకపోగా, ఎందుకు హాజరుకావడంలేదో డబ్ల్యూఎఫ్ఐకి తెలపలేదు. దీంతో డబ్ల్యూఎఫ్ఐ అధికారులు వీరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంపుకు హాజరుకావద్దని, ఇంట్లోనే కూర్చుని ఎంజాయ్ చేస్తూ ఉండమని వెల్లడించింది.
అంతేకాదు ఈ నెల ఆఖరులో నిర్వహించే ట్రయల్స్లో కూడా వీరు పాల్గొనడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేసింది. గీతా ఫోగట్ 2010 కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించడమే కాక 2012 ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించి మల్లయుద్ధంలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు తెచ్చుకుంది. అలానే ఆమె సోదరి బబిత 2014 గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం దక్కించుకొంది.