విజయవాడ, మే 21 : ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి తుదిశ్వాస విడిచారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో కుమార్తెతో పాటు ఉంటున్న ఆమె గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని వారి కుటుంబసభ్యులు వెల్లడించారు. సులోచనారాణి 1940లో కృష్ణా జిల్లా కాజా గ్రామంలో జన్మించారు. భార్యాభర్తల మధ్య ప్రేమలు, కుటుంబ సంబంధాలు ప్రధానాంశంగా ఆమె నవలలు, కథలు రాశారు. ఆమె రచనల్లో అత్యంత ప్రజాదరణ పొందిన నవల 'మీనా'.. దీని ఆధారంగానే ‘మీనా’ చిత్రం తెరకెక్కింది.
ఎక్కువగా కోటీశ్వరుడైన గాయకుడు.. దిగువ స్థాయి నాయిక.. వీరిద్దరి మధ్యా చిగురించే ప్రేమ.. ఇదే ఆమె నవలా సూత్రం. ‘ఆగమనం’, ‘ఆరాధన’, ‘ఆత్మీయులు’, ‘ఆశల శిఖరాలు’, ‘అమర హృదయం’, ‘మౌన తరంగాలు’, ‘దాంపత్యవనం’, ‘ప్రేమ వెన్నెల్లో మల్లిక’, ‘కలల కౌగిలి’, ‘గిరిజా కల్యాణం.. ఇలా సుమారు 40 నవలల వరకూ రాశారు. సులోచనారాణి మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కేసీఆర్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.