చెన్నై, మే 21 : తమిళ్ టాప్ హీరో విశాల్ 'ఇరుంబుతిరై' చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. సమంత కథానాయకగా, పీ.ఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకొంది. ప్రస్తుతం ఆయన లింగుస్వామి దర్శకత్వంలోని ‘సండకోళి 2’లో నటిస్తున్నారు. మదురై పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇందులో కీర్తిసురేష్ కథానాయిక కాగా వరలక్ష్మి ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే 'టెంపర్' రీమేక్లో విశాల్ నటించనున్నారు.
మూడేళ్ల క్రితం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'టెంపర్' చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. పూరి మార్క్ డైలాగులు, తారక్ తారక్ నటన సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఓ చెడ్డ పోలీసు తను ప్రేమించిన అమ్మాయి కోసం మంచి పోలీసుగా మారితే.. న్యాయం కోసం తన ప్రాణాలనే పణంగా పెడితే..? అనే అంశంతో ఈ సినిమా రూపొందింది. త్వరలోనే తమిళ ప్రేక్షకుల ముందుకు రీమేక్తో ఈ సినిమా రానుంది. తన సొంత బ్యానరైన విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానరుపై దీనిని విశాల్ నిర్మించనున్నారు. 'భోగన్' ఫేమ్ లక్ష్మణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.