వరంగల్, మే 21 : టీవీ యాంకర్ కు తృటిలో ప్రమాదం తప్పింది. వరంగల్, హైదరాబాద్ జాతీయ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో టీవీ యాంకర్ లోబో ప్రమాదం నుండి బయట పడ్డారు. వివరాలలోకి వెళ్తే.. యాంకర్ లోబో బృందం తమ సినిమా షూటింగ్.. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని రామప్ప, భద్రకాళి చెరువు, లక్నవరం, వేయి స్తంభాల గుడి ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకొని హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు.
వీరు ప్రయాణిస్తున్న కారు జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామ శివారులోకి రాగానే ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో లోబోతో పాటు ప్రోగ్రాం ప్రొడ్యూసర్ వంశీప్రియకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వీరిని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కారులో వీరితోపాటు ప్రయాణిస్తున్న కెమెరామెన్లు బాపూజీ, సుధాకర్లు సురక్షితంగా ఉన్నారు. ఈ ఘటనలో ఆటోలోని నలుగురు ప్రయాణికులు తీవ్ర౦గా గాయపడ్డారు.