ముంబై, మే 21 : బాలీవుడ్ కథానాయిక ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'రాజీ'. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంకు వినీత్ జైన్, కరణ్జోహార్, అపూర్వ మెహతా నిర్మాతలుగా వ్యవహరించారు. విక్కీ కౌశల్, రజత్ కపూర్, సోనీ రాజ్దాన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మే 11న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు బాక్సాఫీసు వద్ద కూడా చక్కగా వసూళ్ళు రాబడుతుందని సినీ విశ్లేషకులు తెలిపారు. ఆలియా ఇందులో భారత్పై పాకిస్థాన్ కుట్రలను పసిగట్టి ఇక్కడి అధికారులకు సమాచారం చేరవేసే గూఢచారిగా కనిపించారు.
ఆలియా భట్ నటించిన ఈ చిత్రం హరిందర్ సిక్కా పుస్తకం ‘కాలింగ్ శెహమత్’ ఆధారంగా 1971 నాటి ఇండో - పాక్ యుద్ధ పరిస్థితుల నేపధ్యంలో రూపొందింది. దేశం కోసం పాకిస్థాన్ ఆర్మీ అధికారిని పెళ్లి చేసుకున్న కాశ్మీరి యువతి అత్తవారింటికి వెళ్లిన తర్వాత గూఢచారిగా ఎలా మారిందనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది.
ఈ సినిమా రెండు వారాల్లో దేశవ్యాప్తంగా రూ.78.33 కోట్లు రాబట్టినట్లు విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. రూ.100 కోట్ల క్లబ్ వైపు చిత్రం వెళ్తోందని, స్వదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ వసూళ్ల సందడి కొనసాగిస్తోందని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో 3.14 మిలియన్ డాలర్లు (రూ.21.36 కోట్లు) సాధించిందని చెప్పారు. ఉత్తర అమెరికాలో 1.39 మిలియన్ డాలర్లు, యూఏఈ+జీసీసీలో 9,02,000 డాలర్లు, యూకే+ఐర్లాండ్లో 308,000 డాలర్లు, ఆస్ట్రేలియా+న్యూజిలాండ్లో 228,000 డాలర్లు వసూలు చేసినట్లు పేర్కొన్నారు.