శ్రీకాకుళం, మే 23 : ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఒక్కటి కూడా ప్రజలకు సరైన రీతిలో అందడం లేదని, అరకొరగా డయాలసిస్ కేంద్రాలను పెట్టి చేతులు దులిపేసుకుంటున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజల కష్టాలు తీర్చలేని అధికారం మీకెందుకని అధికార పార్టీ పనితీరుపై విమర్శలు గుప్పించారు. ఈ ఉదయం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో పర్యటిస్తున్న జనసేనాని, కిడ్నీ బాధితులతో ప్రత్యేకంగా సమావేశమై, వారిని ఉద్దేశించి ప్రసంగించారు. లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టే ప్రభుత్వం, పేదల కన్నీళ్లను తుడవలేకపోతోందని పవన్ ఆరోపించారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..." నేను ప్రజా సమస్యలను ఎంతగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తున్నా, వాటిని తీర్చడంలో చంద్రబాబు ప్రభుత్వం ఎంతమాత్రం చొరవ చూపడం లేదు. లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టే ప్రభుత్వం, పేదల కన్నీళ్ళు తుడవలేకపోతుంది. ఉద్దానం కిడ్నీ సమస్యపై నేను ఎంతో కాలంగా పోరాడుతున్న. ఈ విషయంలో చంద్రబాబును స్వయంగా కలిసినా, ఇక్కడి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైంది. అసలు డయాలసిస్ వరకూ రోగులను రానివ్వడం ఏంటి. ముందే మందులు ఎందుకు ఇవ్వడం లేదు. ఇది రాష్ట్ర ప్రజల దౌర్భగ్యం" అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.