హైదరాబాద్, మే 23 : "బాహుబలి" చిత్రంతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కథానాయకుడు ప్రభాస్. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన ఈ చిత్రాన్ని పలు భాషలలో విడుదల చేసి మంచి కలేక్షన్లనే రాబట్టారు. అయితే హిందీలో ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ నేపథ్య౦లో కరణ్ జోహార్.. ప్రభాస్ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కనున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఈ వార్తలన్ని౦టికి ప్రభాస్ ఫుల్ స్టాప్ పెడుతూ.. ఇటీవల దుబాయ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
"కరణ్కు నాకు మధ్య మంచి స్నేహం ఉంది. ఎందుకంటే "బాహుబలి" కోసం నాలుగేళ్లు కలిసి పనిచేశాం. దర్శకుడిగా ఆయనంటే నాకు ఇష్టం. మా ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందనేది అవాస్తవం" అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రభాస్.. సుజీత్ దర్శకత్వంలో "సాహో" సినిమాలో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్లు ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తోంది. కాగా ఈ చిత్రంలో కేవలం యాక్షన్ సన్నివేశాలకు మాత్రమే 90 కోట్ల వరకు ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే.