చెన్నై, మే 24 : తమిళనాడులోని తూత్తుకుడిలో స్టెరిలైట్ సంస్థను నిలిపివేయాలని ప్రజలు ఆందోళన బాట చేపట్టిన విషయం తెలిసిందే. మంగళవారం స్టెరిలైట్ పరిశ్రమకు వ్యతిరేకంగా తూత్తుకుడి కలెక్టరు కార్యాలయాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరపడంతో ఇది హింసాత్మకంగా మారింది. పోలీసుల కాల్పుల్లో 13 మంది మృతిచెందారు.
ఈ చర్యకు నిరసనగా డీఎంకే అధినేత స్టాలిన్ తమిళనాడు సచివాలయం వెలుపల ఆందోళనచేపట్టారు. కాగా ఆయనను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. కాల్పులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, వెంటనే ముఖ్యమంత్రి పళనిస్వామితో పాటు డిజిపి రాజేంద్రన్ కూడా రాజీనామా చేయాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర పోలీసుల తీరుకు వ్యతిరేకంగా శుక్రవారం నిరసనలు వ్యక్తం చేస్తామని డీఎంకే వెల్లడించింది.