ఢిల్లీ, మే 24 : దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్ మెన్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ కు ఇష్టమైన ఆటగాడు ఎవరంటే..? ఇంకేముంది క్రీడాభిమానులు ఠక్కున విరాట్ కోహ్లి అని చెప్పేస్తారు. కానీ అది నిజం కాదు. ఏబీడీకి ఇష్టమైన క్రికెటర్ ఎవరో తెలుసా.. భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో పాల్గొన్న డివిలియర్స్ ఓ టాక్ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. డివిలియర్స్తో పాటు జాంటీ రోడ్స్ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకొన్నాడు. ఈ క్రమంలో డివిలియర్స్ను భారత క్రికెటర్లలో మీ అభిమాన క్రికెటర్ ఎవరని అడగ్గా.. అందరూ విరాట్ కోహ్లీ పేరు చెబుతాడని ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ, ఏబీ.. వీరేంద్ర సెహ్వాగ్ అని చెప్పాడు. అనంతరం జాంటీ రోడ్స్ని అడగ్గా సురేశ్ రైనా బదులిచ్చాడు.
డివిలియర్స్ తాజాగా ఓ వీడియో సందేశం ద్వారా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. 'గత 14 ఏళ్లుగా క్రికెట్ ఆడి బాగా అలసిపోయాను. వేరే వాళ్లకు అవకాశం ఇవ్వాలి. ఇది కఠిన నిర్ణయమే. ఆడితే పూర్తిగా ఆడాలి. ఏదో ఒక ఫార్మాట్ను ఎంచుకుని ఆడటం నాకిష్టం లేదు. దేశవాళీ క్రికెట్కి మాత్రం అందుబాటులో ఉంటాను" అని డివిలియర్స్ తెలిపిన విషయం తెలిసిందే. 123 టెస్టుల్లో దక్షిణాఫ్రికాకు ప్రాతినిథ్యం వహించిన డివిలియర్స్ 22 సెంచరీల సాయంతో 8765 పరుగులు చేయగా, 228 వన్డేలాడిన ఏబీ 25 శతకాల సాయంతో 8577 పరుగులు సాధించాడు. 78 అంతర్జాతీయ టీ20లు ఆడాడు.