హైదరాబాద్, మే 24 : 'గులాబి' సినిమాతో దర్శకుడిగా తెలుగు చిత్రపరిశ్రమలో అరంగేట్రం చేసిన కృష్ణవంశీ తర్వాత పలు విజయవంతమైన చిత్రాలు తీసి టాప్ దర్శకుడిగా ఎదిగాడు. 2007 లో వచ్చిన 'చందమామ' చిత్రం తర్వాత ఆయనకు అంతగా కలిసిరాలేదనే చెప్పాలి. తీసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్లగా మిగిలిపోయాయి. గతేడాది వచ్చిన 'నక్షత్రం' సినిమా కూడా అనుకున్న విజయం సాధించలేదు. కాగా ఈ సారి హిట్ కోసం కృష్ణవంశీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. 'చందమామ' తరహాలో ఓ పల్లెటూరి కథ ఎంచుకున్నారని ఫిల్మ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇందుకోసం ఇద్దరు కొత్త హీరోల్ని వెదికి పట్టుకునే పనిలో ఆయన ఉన్నారని సమాచారం. కథ దాదాపుగా సిద్ధమైందని, ఇక నిర్మాత దొరకడమే ఆలస్యమని తెలుస్తోంది. కృష్ణవంశీ ఎన్ని వైఫల్యాలు చవిచూసిన నిర్మాత దొరకడం పెద్ద కష్టమైన విషయమేమీ కాదు. పల్లెటూరి కథ, అందులోనూ కొత్త హీరోలు కాబట్టి తక్కువ బడ్జెట్ లో తీసేయోచ్చు. కాకపోతే ఆ కథ ఎంత బలంగా ఉన్నదన్నదే కీలకం
అంతే కాకుండా రామ్ చరణ్ హీరోగా గ్రామీణ నేపథ్యంలో ఆయన తెరకెక్కించిన 'గోవిందుడు అందరివాడేలే' ఓ మోస్తరు విజయాన్ని అందుకొంది. పల్లెటూరు కథలు కూడా సరైన పద్ధతిలో తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకే కృష్ణవంశీ కూడా సినిమా తీసే విషయంలో ఏమాత్రం తొందర పడడం లేదని, అన్నీఖరారు అయ్యాక రంగంలోకి దిగడానికి ప్లాన్ చేస్తున్నారని.. త్వరలో అధికారకంగా ప్రకటిస్తారని సమాచారం.