'క్రిష్ 4', 'క్రిష్-5' ఓకే ఏడాదిలో రానున్నాయా..!

     Written by : smtv Desk | Fri, May 25, 2018, 01:10 PM

'క్రిష్ 4', 'క్రిష్-5' ఓకే ఏడాదిలో రానున్నాయా..!

ముంబై, మే 25 : ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్‌ రోషన్‌ నటించిన 'కోయి మిల్‌ గయా' చిత్రం ఘన విజయం సాధించడంతో..ఆయన తండ్రి, దర్శక, నిర్మాత రాకేశ్‌ రోషన్‌ దానికి సీక్వెల్‌గా ‘క్రిష్‌’, ‘క్రిష్‌ 3’ చిత్రాలను నిర్మించారు. ఇవి కూడా మంచి హిట్ టాక్ ను దక్కించుకున్నాయి. దీంతో ఇప్పుడు తండ్రీ కొడుకులు రాకేశ్‌ రోషన్‌, హృతిక్‌ రోషన్‌ మరో సీక్వెల్స్ పై భారీ సన్నాహాలు చేస్తున్నారు. ఒకేసారి ‘క్రిష్‌ 4’, ‘క్రిష్‌ 5’ చిత్రాలను నిర్మించి , రెండు చిత్రాలనూ 2020 డిసెంబర్‌ లోగా విడుదల చేయాలని ప్రయత్నాలు ప్రారంభించారు. హృతిక్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ ఏడాది జనవరి 10న రాకేశ్ రోషన్.. ‘క్రిష్‌ 4’ చిత్రాన్ని 2020 క్రిస్‌మస్‌కు విడుదల చేస్తామని వెల్లడించారు.


అయితే ఇప్పుడు ఆయన మనసు మార్చుకొని ‘క్రిష్‌ 4’, ‘క్రిష్‌ 5’ చిత్రాలను ఒకదాని తర్వాత మరొకటిగా 2020లోనే విడుదల చేయాలని నిర్ణయించుకొన్నారు ‌. గత సీక్వెల్స్‌లో ప్రీతీ జింతా, ప్రియాంక కథానాయకులుగా నటించగా, తాజా చిత్రాల్లో మాత్రం కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఆలోచనలో ఉన్నారు. ఈ జంట సీక్వెల్స్‌ గురించి రాకేశ్‌ రోషన్‌ను ప్రశ్నించినప్పుడు 'ప్రస్తుతం స్ర్కిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. దానికి కొంత సమయం పడుతుంది కనుక ఇప్పుడే వాటి గురించి చెప్పుకోవడం అనవసరం' అని వ్యాఖ్యానించారు.

అయితే బాలీవుడ్‌ వర్గాల సమాచారం ప్రకారం నలుగురైదుగురు రచయితల బృందం ఈ రెండు చిత్రాల కథ విషయంలో గట్టి కసరత్తు చేస్తోందట. కథలు పూర్తయిన వెంటనే ఒకే సమయంలో రెండు చిత్రాలనూ నిర్మిస్తారు. ‘క్రిష్‌ 4’ చిత్రంలో హృతిక్‌ హీరోగానూ విలన్‌గానూ నటిస్తారని తెలుస్తోంది.





Untitled Document
Advertisements