పశ్చిమగోదావరి, మే 25 : టీడీపీ నాలుగేళ్ల పాలన రాక్షసపాలన అని వైసీపీ అధినేత జగన్ అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. నాలుగేళ్లుగా చంద్రబాబు తమ నియోజకవర్గానికి చేసిందేమిటని ప్రజలు, రైతులు వాపోతున్నారని ఆయన అన్నారు. నియోజకవర్గం చుట్టూ నీరు ఉన్న ప్రజలు కలుషిత నీరు తాగుతూ బాధలు పడుతున్నారని.. అయిన ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శించారు.
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఆకివీడులో ప్రజా సంకల్ప యాత్రలో జగన్ మాట్లాడుతూ..."ఇదే నియోజకవర్గం చుట్టూ నీళ్లు కనిపిస్తాయి కానీ, తాగడానికి గుక్కెడు నీళ్లుండవు!. మంచినీళ్లు దొరకని పరిస్థితిలో ఉన్నామని ప్రజలు చెబుతున్నారు. మేము తాగుతున్న నీళ్లు ఇవి అన్నా!' అంటూ బాటిల్స్ తీసుకొచ్చే నాకు చూపిస్తున్నారు. చంద్రబాబు గారూ.. ఈ బాటిల్ లో ఉంది చెరుకురసం కాదు... తాగే మంచినీళ్లు! బోర్లు వేస్తే ఉప్పునీళ్లు... తాగునీటిని కొనుక్కోవాల్సిన పరిస్థితిలో పేదలు ఉన్నారంటే ఎంత దారుణం! చంద్రబాబునాయుడు గారిని మీ అందరి తరపున నేను అడుగుతున్నాను.. రాజశేఖర్ రెడ్డిగారి పాలన రామరాజ్యంగా కాదా అని అడుగుతున్నాను. మీ నాలుగేళ్ల పాలన రాక్షసపాలన కాదా?" అని తీవ్రస్థాయిలో జగన్ ధ్వజమెత్తారు.