న్యూఢిల్లీ, మే 25 : రాబోవు సార్వత్రిక ఎన్నికలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీలు ఏకమైన విజయం తమదేనని ఆయన అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 274 స్థానాలతో మోదీ తిరిగి అధికారంలోకి వస్తారని ఏబీపీ సర్వే వెల్లడించిన నేపథ్యంలో అమిత్ షా వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. గత ఎన్నికల్లో గెలవలేకపోయిన 80 కొత్త స్థానాల్లో నెగ్గుతామని చెప్పారు. ఈశాన్యరాష్ట్రాలు, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళలో మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులను మార్చబోమని.. 2019 ఎన్నికల్లో రాయ్బరేలీ, అమేథీల్లో ఒక స్థానాన్ని తప్పకుండా గెలుచుకుంటామని చెప్పారు. అటు మహారాష్ట్రలో శివసేన కలిసి వస్తే సంతోషమేనని.. రాకపోయినా ఇబ్బంది ఉండదన్నారు. రాజస్థాన్ కొత్త అధ్యక్షుడు ఎవరనేది ఈ నెల 26 తర్వాత తేలుస్తామని అమిత్ షా చెప్పారు.