న్యూఢిల్లీ, మే 26 : కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టి సరిగ్గా ఈ రోజుతో నాలుగేళ్లు పూర్తి కావచ్చింది. 2014 మే 26న నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనను గద్దె దించి 2014 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ మెజార్టీతో విజయం సాధించింది. ఈ సందర్భంగా దేశ ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వంపై ఎనలేని విశ్వాసం కనబరుస్తున్న ప్రతి భారతీయుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అని ట్వీట్ చేశారు.
"దేశాన్ని ప్రగతి దిశగా నడిపించేందుకు 2014లో ఇదే రోజు మా ప్రయాణాన్ని ఆరంభించం. ఈ నాలుగేళ్లలో అభివృద్ధి ఓ ఉద్యమంలా సాగింది. దేశ వృద్ధి కోసం ప్రతి భారతీయుడు ఈ ఉద్యమంలో పాలు పంచుకుంటున్నాడు. తమ ప్రభుత్వంపై ఎనలేని విశ్వాసం కనబరుస్తున్న ప్రతి భారతీయుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. 125కోట్ల ప్రజానికం భారత్ను ఉన్నత శిఖరాలను తీసుకెళ్తున్నారు. మీరు ఇస్తున్న మద్దతు, మాపై చూపిస్తున్న ప్రేమానురాగాలే మాకు కొండంత బలం. ఇదే అంకితభావంతో మున్ముందు కూడా దేశ ప్రజలకు సేవ చేస్తాం" అని మోదీ ట్వీట్ చేశారు.