చెన్నై, మే 26 : రజనీకాంత్ అభిమానులు.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీ '2.ఓ' (రోబో-2). ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా గతేడాది దీపావళి రోజున విడుదల కావాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో చిత్రాన్ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే అభిమానులను సర్ ప్రైస్ చేయడానికి దర్శకుడు శంకర్.. "2.ఓ" సినిమా ట్రైలర్ను ఐపీఎల్ ఫైనల్లో ప్రదర్శించనున్నారని కోలీవుడ్లో వార్తలు వినిపించాయి.
ఈ వార్తలపై స్పందించిన చిత్ర యూనిట్.. ఐపీఎల్లో ట్రైలర్ను విడుదల చేసే ఆలోచన ఏ మాత్రం లేదని ఈ వార్తలను ఖండించింది. ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులను జరుపుకు౦టున్న ఈ చిత్రాన్ని ఆ పనులన్ని పూర్తయ్యాకే ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టులో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉండగా రజనీకాంత్ "కాలా" చిత్రంతో వచ్చే నెల ఎనిమిదో తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నారు.