హైదరాబాద్, మే 26 : కళ్యాణ్ రామ్ హీరోగా, మిల్క్ బ్యూటీ తమన్నా కథానాయికగా నటించిన చిత్రం 'నా నువ్వే'. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో కూల్ బ్రీజ్ సినిమాస్ బ్యానర్ పై విజయ్ వట్టికూటి, కిరణ్ ముప్పవరపులు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు జయేంద్ర దర్శకత్వం వహించారు. మొదటిసారిగా జతకొట్టిన కళ్యాణ్ రామ్- తమన్నా జోడీ చాలా బాగుందనే కామెంట్స్ ప్రేక్షకుల నుండి వినిపిస్తున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన ప్రోమోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల తేది ఖరారు అయ్యింది. జూన్ 14న ఈ సినిమా ధియేటర్లలో సందడి చేయనుంది. 'నా నువ్వే' సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. తమన్నా అందాలు, కళ్యాణ్రామ్ లుక్స్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి మాట్లాడుతూ.. " మా `నా నువ్వే` చిత్రాన్ని జూన్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. ఫ్రెష్ లుక్ లవ్స్టోరీ. జయేంద్రగారు సినిమాను అద్భుతమైన ఫీల్తో తెరకెక్కిస్తే.. పి.సి.శ్రీరామ్గారు ఎక్స్ట్రార్డినరీ విజువల్స్తో ప్రతి ఫ్రేమ్ను అందంగా చూపించారు. ఇప్పటి వరకు నందమూరి కల్యాణ్ రామ్ చేయనటువంటి రొమాంటిక్ జోనర్ చిత్రమిది. కల్యాణ్ రామ్, తమన్నాలను సరికొత్త డైమన్షన్లో ప్రెజెంట్ చేసే చిత్రమిది. ఇద్దరినీ ఓ కొత్త మేకోవర్లో చూస్తారు. శరత్ సంగీతం అందించిన పాటలకు ట్రెమెండెస్ రెస్పాన్స్ వస్తోంది. హృదయాన్ని హత్తుకునే క్యూట్ అండ్ బ్యూటీఫుల్ రొమాంటిక్ లవ్స్టోరీ మా `నా నువ్వే` చిత్రం" అని అన్నారు.