హైదరాబాద్, మే 26 : సూపర్ హిట్ హిందీ చిత్రం 'పాకీజా' నటి గీతా కపూర్ ఇక లేరు. రక్తపోటుతో బాధపడుతున్న ఆమె గత నెల 21న ఆసుపత్రిలో చేరారు. ఈ ఉదయం ముంబయిలోని ఎస్ఆర్వీ ఆసుపత్రిలో చేరిన గీత తుదిశ్వాస విడిచారు. గీత మృతి చెందారని నిర్మాత అశోక్ పండిత్ అధికారికంగా మీడియాకు వెల్లడించారు.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. "గీతా కపూర్ ను కాపాడుకోవటానికి శాయశక్తులా ప్రయత్నించాం. కాని ఏమి చేయలేకపోయామని తెలిపారు. గత కొంతకాలంగా ఆమె తన పిల్లల్ని చూడాలని ఎదురుచూస్తోంది. కాని వారెవరు రాలేదు. తీవ్ర అనారోగ్యంతో నేడు కన్నుమూశారు" అంటూ చెప్పుకొచ్చారు.
గత నెలలో గీత తీవ్ర రక్తపోటుతో బాధపడుతుండగా.. స్వయంగా ఆమె కుమారుడు రాజా కపూర్ ఆసుపత్రికి తీసుకువచ్చాడు. డబ్బులు తీసుకు వస్తానని బయటకు వెళ్లి నేటికి తిరిగిరాకపోవడంతో ఆమె అత్యంత దీనస్థితికి చేరుకోవడంతో ఆసుపత్రి వైద్యులే జాలిపడి వైద్య౦ కొనసాగించారు. సోమవారం ఆమెకు అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు సమాచారం.