34 తీర్మానాలతో విజయవాడలో టీడీపీ మహానాడు..

     Written by : smtv Desk | Sat, May 26, 2018, 07:14 PM

 34 తీర్మానాలతో విజయవాడలో టీడీపీ మహానాడు..

అమరావతి, మే 26 : విజయవాడ వేదికగా ఆదివారం జరగనున్న మహానాడులో 34 కీలక తీర్మానాలు చేసేందుకు టీడీపీ సిద్ధమవుతుంది. వీటిలో ఏపీకి సంబంధించినవి 22 తీర్మానాలు కాగా, తెలంగాణకు 8 తీర్మానాలు, ఉమ్మడి తీర్మానాలు నాలుగు ఉన్నాయి. టీడీపీ నేతలు, కార్యకర్తలకు మూడు రోజులు పండుగగా భావించే మహానాడులో చివరి రోజు కీలకమైన రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, రాజకీయాలపై ఈ మహానాడులో చర్చించనున్నారు. జాతీయ స్థాయిలో తృతీయ కూటమి ఆవశ్యకతను రాజకీయ తీర్మానంలో పొందుపరిచే అవకాశం ఉంది.

రాష్ట్రం కోసం జాతీయస్థాయి రాజకీయం అనే పంథాలో ఈ తీర్మానం ఉండవచ్చని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక మహానాడు కోసం దాదాపు 2వేల మంది వలంటీర్లు కష్టపడుతున్నారు. భోజన వసతి, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మహానాడుకి వేల సంఖ్యలో ప్రతినిధులు తరలి వస్తున్నందున, వారి భోజనాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మహానాడు ప్రతినిధులకు భోజనాలు సిద్ధం చేయడానికి 400 మంది పాకశాస్త్ర నిపుణులు పనిచేయనున్నారు. 28న ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకుని ఆయనకు ఇష్టమైన ప్రత్యేక వంటకాల్ని అతిథులకు వడ్డించనున్నారు.





Untitled Document
Advertisements