న్యూఢిల్లీ, మే 26 : డిజిటల్ లావాదేవీల్లో పేటీఎం దూసుకుపోతుంది. కాగా ఈ మధ్య డేటా షేరింగ్పై పెద్ద ఎత్తున్న ఆందోళనలు రేకెత్తడంతో, పేటీఎం కూడా థర్డ్ పార్టీలకు యూజర్ల డేటా షేర్ చేస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వీడియోపై డిజిటల్ వాలెట్ దిగ్గజ పేమెంట్ కంపెనీ పేటీఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వీడియోలో చెప్పినట్టు తాము యూజర్ల డేటాను థర్డ్ పార్టీలకు షేర్ చేయడం లేదని పేటీఎం స్పష్టంచేసింది.
భారత్లోని తమ 300 మిలియన్ రిజిస్ట్రర్ యూజర్ల డేటా భద్రంగా ఉందని పేటీఎం పేర్కొంది. 'సోషల్ మీడియా వ్యాప్తంగా ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. థర్డ్ పార్టీలకు కొంత డేటా షేర్ చేస్తున్నట్టు చెబుతున్న ఆ వీడియోలో ఎలాంటి వాస్తవం లేదు' అని కంపెనీ తన బ్లాగ్ పోస్టులో పేర్కొంది. విజ్ఞప్తి మేరకు లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థలకు తప్ప ఎవరికీ యూజర్ల డేటాను ఇవ్వలేదని పేర్కొంటూ ట్వీట్ చేసింది.
'పేటీఎంలో అయితే మీ డేటా మీదే. అది ఎప్పటికీ మాది కాదు, థర్డ్ పార్టీది కాదు లేదా ప్రభుత్వానిది కాదు' అని స్పష్టత ఇచ్చింది. వినయోగాదారులు అనుమతి ఇవ్వకపోతే, తాము ఎలాంటి డేటాను ఎవరికీ షేర్ చేయమని చెప్పింది. ఇది యూజర్లకు, కంపెనీకి మధ్య ఉండే ఒక నమ్మకమని చెప్పింది. తమ వినియోగదారుల సమాచారం వంద శాతం సురక్షితంగా ఉందని పేర్కొంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో అసలేమాత్రం నిజాలు లేవని, అన్నీ అవాస్తవలేనని సంస్థ వెల్లడించింది.