హైదరాబాద్, మే 30 : ప్రస్తుతం సమాజంలో ఫోన్ల వాడకం వీపరితంగా పెరిగిపోతుంది. ఎవరి చేతిలో చూసిన ఫోన్ లేకుండా ఉండడం లేదు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల హవా అయితే వేరే చెప్పక్కరలేదు. కొన్ని మొబైల్ సంస్థలు అందుబాటు ధరలోకి ఫోన్లను విపణిలోకి ప్రవేశపెడుతున్నాయి. దీంతో మొబైల్ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. కాగా కొంత మంది ఫోన్లు నీటిలో పడేసుకుంటున్నారు. పిల్లలు అల్లరి తట్టుకోలేక వారి చేతిలో పెడితే.. ఇక అంతే నీళ్ల బకెట్లో ఈదుతున్నా ఆశ్చర్యపోనక్కరలేదు. ఆ సమయంలో అబ్బాయిని కొట్టినా..తిట్టినా..ఫలితం లేదు. వాటర్ లో పడిన తర్వాత సదరు వినియోగదారుడు పడే ఆందోళన వర్ణించలేనిది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మొబైల్ దెబ్బతినకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒక్కసారి చూద్దామా?
>> ఫోన్ నీటిలో నుండి బయటకు తీయగానే ది ఆన్లో ఉందో? ఆఫ్లో ఉందో? నిర్ధరించుకోవాలి. ఒకవేళ ఆన్లో ఉన్నట్లయితే.. వెంటనే స్విచ్ ఆఫ్ చేయాలి. చాలా మంది ఫోన్ బయటకు తీయగానే అటూఇటూ దులుపుతూ ఆరబెట్టే ప్రయత్నం చేస్తారు. అలా చేయకూడదు.
>> స్విచ్ ఆన్ అవ్వగానే చాలా మంది ఛార్జింగ్ పెట్టేస్తుంటారు. అందువల్ల ఫోన్ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
>> నీటి నుండి ఫోన్ తీసిన తర్వాత ఎటువంటి ఫోన్లోని ఏ ఫీచర్నూ వాడకూడదు. ఇటీవల కాలంలో చాలా ఫోన్లు నాన్ డిటాచ్బుల్ బ్యాటరీతో వస్తున్నాయి. దీనిలో బ్యాటరీని బయటకు తీసే వెసులుబాటు ఉండదు. ఒక వేళ బయటకు తీసే అవకాశమున్న ఫోన్ అయితే బ్యాటరీని బయటకు తీసి పొడి గుడ్డతో తుడవాలి.
>> మెమొరీ కార్డ్, సిమ్కార్డ్లను ఫోన్ నుంచి తీసేయాలి. అనంతరం మెత్తని పొడిగుడ్డతో తుడవాలి.
>> చాలా మంది తడిసిన ఫోన్ను ఎండలో పెట్టడం లేదా చిన్నని సెగతో వెచ్చబెట్టడం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా చేయకూడదు. దీనివల్ల ఫోన్ పూర్తిగా పాడయ్యే అవకాశాలు ఎక్కువ.
మరేం చేయాలి...
బ్యాటరీ తీసేసిన ఫోన్ను ఓ బియ్యం డబ్బాలో ఉంచి మూతపెట్టేయాలి. దాదాపు రెండు, మూడు రోజుల వరకు దాని ఊసే పట్టకూడదు. డబ్బాలోని బియ్యం వేడికి పోన్లోని తడి నెమ్మదిగా ఆరిపోతుంది. అంతేకాకుండా బియ్యానికి ఉన్న చిన్నపాటి పిండిలాంటి పదార్థం నీటిని క్రమేపీ పీల్చుకుంటుంది. అనంతరం మళ్లీ స్విచ్ ఆన్ చేస్తే దాదాపు పని చేసేస్తుంది. ఒకవేళ పనిచేయకపోతే మొబైల్ సర్వీస్ సెంటర్కు తీసుకెళ్లడం ఉత్తమం.