కాలిఫోర్నియా, జూన్ 2 : ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్బుక్ ఓ సరికొత్త నిర్ణయం తీసుకొంది. ఫేస్బుక్ పేజ్ లో కనిపించే ట్రెండింగ్ టాపిక్స్ ఫీచర్ను తొలగించి దాని స్థానంలో బ్రేకింగ్ న్యూస్ ఆప్షన్ను తీసుకురావాలనుకుంటున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఆసక్తికర కథనాలను అందించే ఉద్దేశంతో నాలుగు సంవత్సరాల క్రితం ట్రెండింగ్ న్యూస్ ఫీచర్ను కాలిఫోర్నియా కేంద్రంగా నడుస్తోన్న ఈ సంస్థ నెటిజన్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. 'వినియోగదారులకు నిత్యం కొత్త విషయాలు అందించడానికి ఇతర మార్గాలను అన్వేషిస్తున్నాం. విశ్వసనీయ మార్గాల ద్వారా వచ్చే సమాచారాన్నే అందుబాటులో ఉంచుతాం' అని ఫేస్బుక్ ప్రతినిధి తెలిపారు.
ట్రెడింగ్ ఫీచర్ కొన్నిదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉందని, దాని ద్వారా కొన్ని క్లిక్స్ మాత్రమే వస్తున్నాయని ఆ ప్రతినిధి వెల్లడించారు. ఆస్ట్రేలియా, యూరప్, ఇండియా, అమెరికాలకు చెందిన 80 వార్తా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామని, బ్రేకింగ్ న్యూస్ ద్వారా విశ్వసనీయ సమాచారాన్ని మాత్రమే నెటిజన్లకు అందిస్తామని వెల్లడించారు. సమాచార సేకరణకు ఫేస్బుక్ను మరింత నమ్మకమైన సాధనంగా మార్చడానికి ఈ చర్య ఉపయోగపడుతుందని కంపెనీ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ ఉపాధ్యక్షుడు తెలిపారు.