హత 'విధి'..

     Written by : smtv Desk | Tue, Jun 05, 2018, 12:50 PM

హత 'విధి'..

చిత్తూరు, జూన్ 5 : ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టీసీ డ్రైవర్ల నిర్లక్ష్య ధోరణి వల్ల విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కానీ చిత్తూరులో ఒక ప్రభుత్వ చోదకుడు తన ప్రాణం పోతుందని తెలిసి కూడా బస్ లో తన వెనక ఉన్న 50మంది ప్రాణాల గురించి ఆలోచించాడు. గుండెనొప్పితో బాధపడుతూ కూడా జాగ్రత్తగా బస్సుని తీసుకొచ్చి బస్టాండ్ లో ఆపి తన సీట్లోనే కుప్పకూలాడి, విధి నిర్వహణలోనే ప్రాణాలు విడిచాడు.

చిత్తూరు జిల్లా పిచ్చాటూరులో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. తమిళనాడు రాష్ట్రం పళ్లిపట్టుకు సమీప కరింబేడు గ్రామానికి చెందిన అరుణాచలం(45) 15 ఏళ్లుగా ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం తిరుమల డిపోకు చెందిన తిరుమల-చెన్నై సర్వీసు డ్రైవర్‌గా చెన్నైకు వెళ్లిన ఆయన సాయంత్రానికి అస్వస్థతకు గురయ్యాడు.

చెన్నై నుంచి 50 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఆయన మధ్యలో రెడ్‌హిల్స్‌లో బస్సు ఆపి మాత్రలు వేసుకున్నారు. ఇబ్బంది పడుతూనే రాత్రి పిచ్చాటూరుకు చేరుకున్న ఆయన ప్రయాణికులను దించేందుకు బస్సు ఆపారు. అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మరోసారి మందులు వేసుకొని కాసేపటికే గుండెపోటుతో స్టీరింగ్‌పై వాలిపోయి అక్కడికక్కడే తుదిశ్వాస విడిచాడు.





Untitled Document
Advertisements