లక్నో, జూన్ 9 : బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో శనివారం లక్నోలో సమావేశం అయ్యారు. సంజయ్ దత్ తన సినిమా షూటింగ్ నిమిత్తం గత కొద్దిరోజులుగా లక్నోతో పాటు వారణాసి పరిసరాల్లో ఉంటున్నారు. శనివారం లక్నోలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి సంజయ్ దత్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు నాలుగేళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన ఘనతలను వివరించారు. అనంతరం ఎన్డీఏ సర్కార్ నెరవేర్చిన హామీలు, చేరుకున్న లక్ష్యాలు, పలు పథకాలకు సంబంధించిన బుక్లెట్ను సంజయ్కు యోగీ అందజేశారు. వీరిద్దరి మధ్య అనధికారిక సమావేశం కూడా జరిగిందని కథనాలు వెలువడుతున్నాయి.
బీజేపీ అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా 'సంపర్క్ ఫర్ సమర్థన్' అనే ప్రచార కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా పార్టీ కార్యకర్తలు ఒక లక్ష మందిని కలుసుకోవాలనేది లక్ష్యం. ఇందులో పార్టీ చేపట్టిన కార్యక్రమాలు, ప్రభుత్వం సాధించిన విజయాల గురించి వివరిస్తారు. ఎన్నికలకు ఏడాదే సమయం ఉండటంతో ప్రజల్లోకి విస్తృతంగా బీజేపీ ప్రభుత్వం చేపట్టిన పనుల గురించి వెళ్లాలని ఆ పార్టీ ఈ విధమైన కార్యక్రమానికి రచన చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తొలుత ఈ కార్యక్రమాన్ని కొద్దిరోజుల క్రితం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఢిల్లీలో లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ తదితరులను కలిసి ప్రారంభించిన విషయం తెలిసిందే.