హైదరాబాద్, జూన్ 10 : నందమూరి నటసింహం బాలకృష్ణ నేటితో 57 సంవత్సరాలు పూర్తిచేసుకొని 58వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో స్పందించిన చంద్రబాబు.. "తెలుగు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా" అంటూ చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడు శివాజీ రాజా.. బాలయ్యను కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బాలయ్య నివాసానికి వెళ్లి ఆయనకు 'మా' తరఫున సిల్వర్ జూబ్లీ షీల్డును అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ "ఎన్టీఆర్" సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.