పట్నా, జూన్ 11 : మట్టిలో మాణిక్యాలను బయటకు తీసి, నిరుపేద విద్యార్ధులకు ప్రతిష్ఠాత్మక ఐఐటీలకు అర్హత సాధించేలా తీర్చిదిద్దుతున్న బిహార్లోని 'సూపర్-30' అకాడమీ మరోసారి అద్భుత ఫలితాలు సాధించింది. ఈసారి ఇందులో శిక్షణ పొందిన 30 మంది ప్రతిభావంతుల్లో 26 మంది ఐఐటీ-జేఈఈ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఆనంద్కుమార్ అనే గణిత మేధావి 2002లో ఈ సంస్థను మొదలుపెట్టారు. ఆయన కుటుంబ సభ్యులూ దీని నిర్వహణలో తోడ్పడుతున్నారు.
ప్రతి ఏడాది మారుమూల ప్రాంతాలు, వెనుకబడిన వర్గాలకు చెందిన 30 మందిని ఎంపిక చేసి ఉచితంగా ఆనంద్ శిక్షణనిస్తున్నారు. విద్యార్థులకు భోజనం, వసతి సదుపాయాలు కూడా ఆయనే ఉచితంగా కల్పిస్తున్నారు. గత 16 ఏళ్లలో ఈ సంస్థ నుంచి దాదాపు 500 మంది ఐఐటీలకు అర్హత సాధించారు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ప్రయోజనం పొందేలా సూపర్-30ని మరింత విస్తరించాలనుకుంటున్నట్లు ఆనంద్ చెప్పారు. 'సూపర్-30' విజయాలతో ఆనంద్ ప్రపంచవ్యాప్తంగా పేరు పొందారు. ఆయన జీవితచరిత్ర ఆధారంగా ఓ హిందీ చిత్రమూ తెరకెక్కుతోంది. ఆనంద్ పాత్రను ప్రముఖ నటుడు హృతిక్ రోషన్ పోషిస్తున్నారు.