బెంగళూరు, జూన్ 11 : టీమిండియా క్రికెటర్లకుఫిట్ నెస్ కోసం బీసీసీఐ యో యో పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ పరీక్షలో ఐపీఎల్ 2018 సీజన్లో మెరుగ్గా రాణించి.. భారత -ఎ జట్టులో చోటు సంపాదించిన వికెట్ కీపర్/ బ్యాట్స్మెన్ సంజు శాంసన్ విఫలమయ్యాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో నిర్వహించే ఈ టెస్టులో పాసైతేనే ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కుతుంది. లేదంటే ఇక వారి సంగతి అంతే. దీంతో జట్టులో చోటు కోల్పోయి ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే అవకాశాన్ని సంజు కోల్పోయాడు.
ఆదివారం శ్రేయ్యస్ అయ్యర్ నాయకత్వంలోని భారత్-ఎ జట్టు లండన్కు బయల్దేరింది. ఇంగ్లాండ్ లయన్స్- వెస్టిండీస్-ఎతో భారత తలపడనుంది. జూన్ 22 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఇంగ్లాండ్-ఎతో భారత్-ఎ నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఈ టెస్టు జులై 16న ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించిన సంజు శాంసన్ 441 పరుగులు చేశాడు.